- ఇది తన దాసుల పట్ల అల్లాహ్ యొక్క కరుణ – వారిని ఇహలోక జీవితంలోనే పరీక్షలకు గురి చేసి వారి పాపాలను, వారి అతిక్రమణలను ఇక్కడే పరిహరించుకు పోయేలా చేయటం.
- దాసునిపై వచ్చి పడే పరీక్షలు ఒక షరతుపై ఆధారపడి అతడి పాపాలను, అతిక్రమణలను పరిహరిస్తాయి – ఆ షరతు ఏమిటంటే అతడు విశ్వాసాన్ని కలిగి ఉండడం, దానిని కోల్పోకుండా ఉండడం, పరీక్షలు అతనిపై వచ్చిపడుతుండడంతో అతడు అసహనానికి, అసంతృప్తికి, కోపానికి గురికాకుండా – సహనం వహించడం.
- ఈ హదీథులో అన్ని విషయాలలో సహనం వహించడం, ఓపికగా ఉండడం అవసరం అనే హితబోధ ఉన్నది – అది మనం ఇష్టపడే విషయమైనా, మనకు ఇష్టం లేని విషయమైనా సరే – అల్లాహ్ ఆదేశించిన దానిని ఆచరించుటలో సహనం వహించాలి, అలాగే అల్లాహ్ నిషేధించిన వాటి నుండి పూర్తిగా దూరంగా ఉండుటలో సహనం వహించాలి; అది కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ, మరియు ఆయన శిక్షకు భయపడుతూ జరగాలి.
- ఈ హదీథులో “విశ్వాసులలో స్త్రీలు, పురుషులు..” అని పేర్కొనబడింది. ఇటువంటి సందర్భాలలో అభివ్యక్తి కొరకు వాడే పదాలు సాధారణంగా పుంలింగ పదాలే అయి ఉంటాయి. అయినప్పటికీ అందులో ఉన్న విషయము, లేద ఆదేశము పురుషులకు మాత్రమే కాకుండా, స్త్రీలకు కూడా వర్తిస్తుంది. కానీ ఈ హదీథులో అలా కాకుండా “విశ్వాసులలో స్త్రీలు..” అని స్త్రీలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పేర్కొనడం జరిగింది. అలా పేర్కొనటం దేనికి సాక్ష్యమంటే, స్త్రీలపై కూడా ఏదైనా కష్టం, ఆపద వచ్చి పడితే ఆమెకు కూడా ఇదే విధమైన ప్రతిఫలం ఇవ్వబడుతుంది – ఆమె పాపాలు, ఆమె అతిక్రమణలు అన్నీ పరిహరించి పోయి ఆమె అల్లాహ్’ను కలుసుకుంటుంది.
- అల్లాహ్ యొక్క దాసునిపై, ఒకదాని తరువాత ఒకటిగా వచ్చి పడే కష్టాలను, బాధలను, పరీక్షలను ఎదుర్కొనడాన్ని ఏ విషయం సులభతరం చేస్తుంది అంటే, అది తద్వారా లభించే పుణ్యఫలం యొక్క ఘనతయే.